పాలంక గుడి, పాలుట్ల గ్రామం, నల్లమల అడవి:
పాలుట్ల గ్రామం ఈ ఊరు గురించి పెద్దగా విని ఉండకపోవచ్చు ఊరిని ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. నల్లమల అడవుల్లో మధ్యభాగంలో ఉన్న అందమైన పెద్ద గ్రామం. ఇక్కడికి చేరుకోవాలంటే సరైన రహదారి కూడా లేదు. ఈ గ్రామంలో 1500 మంది చెంచు, సుగాలి గిరిజన జాతులకు చెందిన ప్రజలు నివసిస్తారు. చెంచు గిరిజనుల జీవన విధానం దగ్గరనుండి పరిశీలించాలంటే పాలుట్ల అనువైన ప్రాంతం.
ఈ గ్రామ ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసరాలను పండించడం ద్వారా, అడవి నుంచి సేకరించడం ద్వారా పొందుతారు. దాదాపు 360 ఎకరాల సాగుభూమిలో పత్తి, మిరప పంటలు పండిస్తారు గ్రామ ప్రజలు తమకు కావలసిన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం ద్వారా స్వయం సమృద్ధిగా ముందుకు సాగుతున్నారు.
ఇక్కడ పండే పత్తి, మిరప పంటల ఉత్పాదకత ఎక్కువగా ఉండటంవల్ల అప్పుడప్పుడు కాలేజీ విద్యార్థులు పరిశోధన కోసం ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.అధికారులు 5 సంవత్సరాలలో ఒకసారి మాత్రమే అనగా ఎన్నికల సమయంలో హెలికాఫ్టర్ ద్వారా వచ్చే పోలింగ్ నిర్వహించి వెళ్ళిపోతారు. ప్రతినెల రేషన్ సరుకులు అందించడానికి మరియు వైద్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే లారీలు, జీపులు వెళ్తూ ఉంటాయి.
పిల్లలకు చదువు చెప్పేందుకు గిరిజన ఆశ్రమ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో పాలుట్ల, గుట్టలచేనుపెంట, నారు తడికల పెంట, నెక్కంటి గ్రామాలకు చెందిన సుమారు వందమంది విద్యార్థులు చదువుకుంటున్నారు.ఉన్నత పాఠశాల చదువు చదవాలంటే మాత్రం ప్రకాశం జిల్లాలోని గిరిజన హాస్టల్స్ లో చేరాల్సిందే! పాలుట్ల గ్రామం నుండి దట్టమైన అరణ్యంలో క్రూర మృగాల మధ్య 12 గంటల ప్రయాణించి చినారుట్ల గ్రామం చేరుకొని అక్కడి నుండి బస్సు ద్వారా హాస్టల్ కి వెళ్ళవలసి ఉంటుంది .
This slideshow requires JavaScript.
పాలుట్ల గ్రామం చేరుకోవడానికి రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి గుడి మీదగా, ఇది కేవలం నడకదారి మాత్రమే ఇష్టకామేశ్వరి వరకు జీపు మార్గం అందుబాటులో ఉంది. అక్కడినుంచి 30 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళవలసిందే. ఇకపోతే రెండవ మార్గం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మీదగా, పదిహేను కిలోమీటర్లు దూరం ఉన్న గంజివారి పల్లె కు వెళితే అక్కడ నల్లమల అడవిలో కి ప్రవేశిస్తాం. అక్కడనుండి ఆరు గంటలపాటు రాళ్లతో కూడిన దారుణమైన రోడ్డులో 50 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే పాలుట్ల గ్రామాన్ని చేరుకోవచ్చు. కమాండర్ జీపులు, లారీలు, ట్రాక్టర్ ల మీద మాత్రమే ప్రయాణించడానికి వీలు ఉంటుంది. బైకు మీద అతికష్టం మీద ప్రయాణించిన రిపేరు వస్తే చాలా ఇబ్బంది పడాలి.
పాలుట్ల గ్రామంలో ఎటువంటి ఆధునిక సౌకర్యాలు ఉండవు. సోలార్ పవర్ ద్వారా లైట్లు ఏర్పాటు చేశారు. గ్రామం మొత్తానికి ఒక కాయిన్ ఫోన్ అందుబాటులో ఉంది. చదువుకున్న యువకులు 20 మీటర్ల పొడవైన వెదురుబొంగు తో సెల్ టవర్ ఒకటి ఏర్పాటు చేశారు. దాని ద్వారా శ్రీశైలం లో ఉన్న టవర్ signals అందుకొని పక్క గ్రామాల బంధువులతో మాట్లాడగలుగుతున్నారు.
చారిత్రక పుస్తకాల్లో పేర్కొన్న ఈ గ్రామంలో చూడవలసినవి. గ్రామములో ఒక రామాలయం మరియు గ్రామ శివారులో ఉన్న హనుమంతుని ఆలయం. అంతేకాక ఈ గ్రామానికి 6 నుండి 7 కిలోమీటర్ల దూరములో దూరంలో గుట్టల చెరువు పెంట గ్రామపరిధిలో రెండు కొండల మధ్య ఒక పెద్ద లోయ ఉంది. లోయలోని కొండ గుహలో ప్రసిద్ధిచెందిన ప్రాచీనమైన వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఈ ప్రాంతాన్ని పాలంక అంటారు. ఈ ఆలయంపై ఉన్న కొండపై నుండి వాగు (Stream) దూకటం వల్ల జలపాతం ఏర్పడింది. ఇది వర్షాధారం, బాగా వర్షాలు పడినప్పుడు చాలా పెద్దదిగా ఉంటుంది. దీన్ని ఆంధ్ర నయాగరా జలపాతం అన్నా అతిశయోక్తి లేదు.
పాలంక వీరభద్ర స్వామి ఆలయం:
ఈ ఆలయ చరిత్ర చూస్తే విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు తన తూర్పు దండయాత్రలో భాగంగా గజపతులను ఓడించి తిరుగు ప్రయాణంలో శ్రీశైలాన్ని సందర్శించారు. అలా కృష్ణానది ఒడ్డున ప్రయాణం సాగిస్తుండగా దారి దోపిడీ దొంగలనుంచి తమని కాపాడాలని ప్రజలు రాయల వారిని వేడుకున్నారు.
అప్పుడు తన సైన్యాధిపతులైన బోడ వెంకటపతి నాయుడు, నలగాటి పెద్ద తిమ్మానాయుడు కు ఈ ప్రాంతాన్ని జాగీరుగా ఇచ్చి నది పక్కన ఆగటం కోట నిర్మించారు. అక్కడ నుండి 6 కిలోమీటర్ల దూరంలో పాలంక వీరభద్రుడు, భద్రకాళీ మాత ను ప్రతిష్టించి ఆ ప్రాంత రక్షణ బాధ్యతను తన సైన్యాధిపతులకు అప్పగించారని చరిత్ర చెబుతుంది.
This slideshow requires JavaScript.
నల్లమల అడవుల్లో సంవత్సరానికి ఒకసారి మాత్రమే దర్శించుకునే ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్న పాలంక వీరభద్ర స్వామి ఆలయం ప్రత్యేకత సంతరించుకుంది. దట్టమైన అరణ్యంలో పచ్చని చెట్లు పెద్ద కొండ చరియపై జాలువారే జలపాతం భక్తులను మైమరిపిస్తుంది. ఆదిశేషుని ఆకారంలో సహజసిద్దంగా ఏర్పడిన కొండచరియ కింద మూలవిరాట్ పాలంకేశ్వరుడితోపాటు వీరభద్రుడు ,గణపతి, పంచముఖ బ్రహ్మ, పోతురాజు ఆలయాలు పది అడుగుల ఎత్తు నాగమయ్య పుట్ట ఉన్నాయి.
ఆలయం కు సంవత్సరములో మూడు రోజులపాటు తిరునాళ్లు జరుగుతాయి. ఈ సమయంలో ప్రకాశం, గుంటూరు మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల నుంచి భక్తులు వేల సంఖ్యలో పాలంక ను దర్శిస్తారు. ఈ సంవత్సరం జులై 23, 2018 న ఏకాదశి పండుగ కావున july 22, 23 ,24 తేదీలలో పాలంక ను దర్శించుకోవచ్చు. ఆ రోజుల్లో ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. పాలంక నుండి పాలుట్ల గ్రామం దర్శించటం సులువు. పాలుట్ల గ్రామంలో కూడా తొలిఏకాదశి రోజున అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సంతాన ప్రాప్తి కోసం భక్తులు అధిక సంఖ్యలో ఈ క్షేత్రాన్ని దర్శిస్తుంటారు.
కొంతమంది భక్తులు ఎర్రగొండపాలెం నుండి పాలంక కు లారీల్లో వచ్చి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి నడక మార్గం ద్వారా పాలుట్ల, నెక్కంటి, ఇష్టకామేశ్వరి మీదగా శ్రీశైల దర్శనం కూడా చేసుకుంటారు. పాలంక ప్రయాణించే భక్తులు గంజివారి పల్లె నుండి బయలుదేరి అడవిమార్గంలో 20 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఒకటి వస్తుంది. ఆ ప్రాంతాన్ని పెద్దమ్మ అంటారు. అక్కడ భక్తులందరూ ఆగి చెంచు దేవతలైన పెద్దమ్మ, పసిమ్మ ప్రతిమలకు తమ ప్రయాణం సజావుగా సాగాలని కొబ్బరికాయ కొట్టి ముందుకు సాగిపోతారు.
తొలి ఏకాదశి కి ఎలాంటి అనుమతులు లేకుండా పాలంక వీరభద్ర స్వామిని, పాలుట్ల గ్రామాన్ని సందర్శించవచ్చు. మిగిలిన సందర్భాల్లో వెళ్లాలంటే ఫారెస్ట్ అధికారుల అనుమతి తప్పనిసరి..
పాలంక లోయలో కృష్ణా నది వైపు 6 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే అల్లాటం కోటకు చేరుకోవచ్చు. ఇది ఒక బోయ కోట. తూర్పు చాళుక్యులు, విజయనగర రాజుల కాలంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో దాదాపు 13 బోయ కోటలు ఉండేవి. వాటిలో ఒకటి ఆలాటం కోట. గతంలో మేము ఇష్టకామేశ్వరి నడిచి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో కనిపించిన పాలుట్ల గ్రామానికి చెందిన ఎలమంద నాయక్ ఈ కోట గురించి వివరాలు చెప్పారు. ఇక్కడ ఒక వదిలివేయబడిన ఫిరంగి కూడా ఉందని చెప్పారు.
శ్రీశైలానికి నాలుగువైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి 1950వ దశకంలో ఘాట్ రోడ్ నిర్మించకముందు ఈ ద్వారాల గుండా కాలినడకన భక్తులు శ్రీశైల దర్శనం చేసుకొనేవారు. శ్రీశైల ఉత్తర ద్వారం త్రిపురాంతకం. త్రిపురాంతకం నుండి శ్రీశైలానికి ఎర్రగొండపాలెం, ganjivaripalli, పాలంక ,పాలుట్ల ,నెక్కంటి, ఇష్టకామేశ్వరి మీదగా శ్రీశైల దర్శనం చేసుకొనేవారు. అందుకనే ఈ మార్గాల్లో జనావాసాలు ,చిన్న గుళ్ళు వెలిశాయి.
వచ్చే తొలి ఏకాదశి కి మేము ఎర్రగొండపాలెం నుంచి లారీలో పాలంక కు చేరుకొని అక్కడినుంచి పాలుట్ల గ్రామం చేరుకుంటాం. వీలైతే శ్రీశైలము నడక ద్వారా చేరుకునే ప్రయత్నం చేస్తాం.
మేము తెనాలి( గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్) నుండి ముగ్గురము కనిగిరి( ప్రకాశం జిల్లా) నుండి ముగ్గురు మొత్తం ఆరుగురు కలిసి బృందంగా ఏర్పడి ఎర్రగొండపాలెం నుండి లారీలో పాలంక వీరభద్ర స్వామిని దర్శించుకొని (జులై 22 2018) అక్కడినుండి తొలి ఏకాదశి రోజున( జులై 23, 2018) ఉదయం 6 గంటలకు పాలుట్ల దిశగా కాలినడక సాగించాం ఆరు ఏడు కిలోమీటర్లు నడిచిన తర్వాత రెండు వాగులు దాటి గుట్టల చెరువు పెంట అనే గ్రామాన్ని చేరుకున్నాము.
This slideshow requires JavaScript.
దాదాపు 30 నుండి 40 కుటుంబాలు ఈ గ్రామంలో నివాసం ఉంటున్నాయి. కొంతమంది గ్రామస్థులతో మాట్లాడి 5 కిలోమీటర్లు ప్రయాణించి పదకొండు గంటలకల్లా పాలుట్ల గ్రామం చేరుకున్నాము మేము వెళ్లేసరికి రామాలయంలో అన్నదాన కార్యక్రమం అంగరంగవైభవంగా జరుగుతుంది.
meals at palutla ramalayam
పాలుట్ల గ్రామ శివారులో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ప్రాచీనమైనది. దాని ప్రక్కనే ఒక శివాలయం కూడా నిర్మాణంలో ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే పాలుట్ల పాఠశాల గురించి విశాలమైన గదులు చాలా పెద్ద ప్రాంగణం చుట్టూ అడవి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
రామాలయంలో భోజనం చేసి కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ మా నడక నెక్కంటి వైపుగా సాగింది మా నడకలో అతికష్టమైన భాగం పాలుట్ల, నెక్కంటి మధ్యలో ఉంది. అదే నెక్కంటి కొండ.
దాదాపు రెండు గంటలు భుక్తాయాసం తో కష్టపడి కొండ ఎక్కి ఒక మైదాన ప్రాంతానికి( కొండల మధ్యలో ఉన్న చదునైన భూమి) చేరుకున్నాం. అదే నెక్కంటి మార్గంలో గూగుల్ మ్యాప్ లో నక్కిపెంట అనే ఊరు దారిలో ఉన్న వాస్తవంగా మాకు ఆ ఊరు కనిపించలేదు. నెక్కంటి లో ఆ ఊరు గురించి అడిగాను అలాంటిది లేదని చెప్పారు( బహుశా నక్కిపెంట గ్రామం వేరే చోటకి మారి ఉండిఉండవచ్చు.
చెంచుల ఆచారం ప్రకారం గ్రామంలో ఎక్కువ రోగాలు వచ్చినా, ఆకస్మికంగా ఎక్కువ మరణాలు సంభవించినా, ప్రజల మధ్య గొడవలు ఏమైనా అయినా ఆ గ్రామాన్ని విడిచి పెట్టి వేరేచోట గ్రామం నిర్మించుకునే అలవాటు ఉంది) నెక్కంటి లో మొత్తం నాలుగు గుడిసెలు ఉంటాయి. ఈ గ్రామం కూడా మైదాన ప్రాంతం కావడంతో వీరు ఎక్కువగా ఆవులను మేపుతున్నారు.
నెక్కంటి దాటి ఒక కిలోమీటరు ఇష్టకామేశ్వరి వైపు ప్రయాణం చేస్తే నెక్కంటి వాగు తగులుతుంది. వాగు దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకుంటుండగా అప్పుడప్పుడే వాతావరణం మారిపోయి నల్లని మబ్బులు పట్టి ఈదురుగాలులతో ఒక అరగంట వర్షం కురిసింది. వర్షంలో తడిసిన మాకు అంత ఉపశమనం కలిగి అదనపు శక్తి వచ్చినట్టుంది.
Collecting water in Nekkanti stream
అక్కడినుండి ఇష్టకామేశ్వరి దిశగా మా ప్రయాణం కొనసాగింది. నాలుగు గంటల ప్రాంతంలో మేము అంకలేటివాగు చేరుకున్నాము. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటుండగా మళ్లీ వర్షం వచ్చింది. వర్షంలో తడుచుకుంటూ మేము సాయంత్రం ఆరుగంటలకల్లా ఇష్టకామేశ్వరి చేరుకోగలిగాము.
ఇష్టకామేశ్వరి నుండి ఇంకా 12 కిలోమీటర్లు నడిస్తే కానీ శ్రీశైలం ఘాట్ రోడ్డు చేరుకోలేము. చీకటి పడటంతో వన్యప్రాణులు తిరిగే అవకాశం ఉంది కనుక భద్రత దృష్ట్యా ఆ రాత్రికి ఇష్టకామేశ్వరి లోనే బస చేయాలనుకున్నాం. ఇంతలో మాతోపాటు కనిగిరి నుంచి వచ్చిన ముగ్గురు అత్యవసర పని దృష్ట్యా వద్దని వారించినా వెళ్దామని నిర్ణయించుకున్నారు.
This slideshow requires JavaScript.
Nekkanti to Istakameswari route
రాత్రి కావడం అందులో వారికి ఆ రూటు తెలియదు. మా దగ్గరున్న టపాకాయలు మరియు లైటర్ ఇచ్చి కొన్ని దారి గుర్తులు చెప్పి పంపించాము. జియో ఫోన్ సిగ్నల్స్ అందడంతో వారిని గైడ్ చేశాము. రాత్రి 8 గంటల టైం లో చీకటి బాగా పెరగడంతో ఎదురు బొంగు ని తీసుకొని ఒక చివర చీల్చి దాంట్లో గడ్డి మరియు క్లాత్ పెట్టి నిప్పు వెలిగించడం జరిగింది. ఎట్టకేలకు 9:30 సమయంలో ఇష్టకామేశ్వరి ఎంట్రెన్స్ గేట్ చేరారు. అక్కడ ఉన్న ఫారెస్ట్ గార్డ్ కొంత విచారణ చేసి పంపించారు. మేము హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం.
ఇక మా సంగతికి వస్తే ఇష్టకామేశ్వరి లో మాకు ఎటువంటి ఆహారం దొరకలేదు. మా దగ్గర ఉన్న మూడు రోజుల క్రితం చేసిన రొట్టెలను భుజించి ఇష్టకామేశ్వరి గుడి ముందు ఉన్న షెడ్లో నిద్రకు ఉపక్రమించాము. ఇక్కడ ఆరుగురు చెంచుల ఇళ్ళు కూడా ఉన్నాయి. సోలార్ పవర్ ద్వారా వారికి కరెంటు సదుపాయం కల్పించారు.
గుడి పక్కనే కామాక్షమ్మ వాగు ప్రవహిస్తూ ఉంటుంది. రాత్రిపూట ఎలుగుబంటి లాంటి కొన్ని జంతువులు నీటి అవసరాల కోసం ఇక్కడ వస్తాయని అక్కడ వారు మాతో చెప్పారు. అర్ధరాత్రి లేచి చూడగా చెంచులకు చెందిన వేట కుక్కలు నాలుగు తిరుగుతూ కాపలా కాస్తూ కనిపించాయి. ఇక మేము ధైర్యంగా పడుకున్నాము.
ఉదయం లేచి కామాక్షమ్మ వాగులో స్నానం చేసి ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకుని శ్రీశైలం వైపు మా నడక ప్రారంభించాము. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం చేరుకొని, దర్శనం చేసుకొని వెంటనే గుంటూరు బస్సు ఎక్కాం.
దీంతో మా 40 కిలోమీటర్ల ఆఫ్ రోడ్ ప్రయాణము మరియు 40 కిలోమీటర్ల నడక పూర్తయి సంతోషంగా ఇంటికి చేరాము.
——————————————————————————————————— వేదాద్రి నల్లగొర్ల
…………………………………………………………………………………………………………………..9346776582
PALANKA VEERABADRA TEMPLE,NALLAMALA FOREST,PRAKASAM Dt,A.P
for youtube vedio
Palanka Veerabhadra Swamy Cave temple, Nallamala forest …